మీడియాపై కేసులు ఎత్తేస్తాం: రోశయ్య




ఉస్మానియా యూనివర్సిటీలో మీడియాపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కె.రోశయ్య హామీ ఇచ్చారు. పోలీసుల లాఠీఛార్జిలో దెబ్బ తిన్న కెమేరాలు, సెల్‌ఫోన్‌లు, వాహనాలకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లిస్తుందని తెలిపారు. సీఎం హామీతో మీడియా శనివారం తలపెట్టిన బడ్జెట్‌ సమావేశాల ప్రసార బహిష్కరణను విరమించుకుంది. శనివారం ఉదయం శాసనసభ సమావేశాలు ప్రారంభమైనా వాటిని టీవీ ఛానళ్లు ప్రసారం చేయలేదు. ఈ సమాచారం సీఎం దృష్టికి వెళ్లడంతో ఐజేయు ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరెడ్డిసహా మీడియా ప్రతినిధులను తన ఛాంబర్‌కు పిలిపించి మాట్లాడారు. ఈ సమయంలో హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, సమాచార శాఖ మంత్రి జె.గీతారెడ్డి కూడా ఉన్నారు.

దాడి సంఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇస్తూ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. అనంతరం సీఎం సూచన మేరకు మంత్రులు గీతారెడ్డి, సబితాఇంద్రారెడ్డిలు 'మీడియా పాయింట్‌' వద్ద విలేఖరులతో మాట్లాడారు. ఉస్మానియా సంఘటన నేపథ్యంలో విలేకరులపై పెట్టిన కేసులను ఎత్తివేస్తామని చెప్పారు. బాధ్యులైన పోలీసులపై కేసులు పెట్టాలన్న డిమాండ్‌పై హోంమంత్రి స్పందిస్తూ సీఐడీ దర్యాప్తు నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సీఎం హామీతో బడ్జెట్‌ ప్రసంగాన్ని బహిష్కరించాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించినట్టు ఐజేయు ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు.